అచ్యుతాపురం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆడలేక మద్దెల దరువు అన్న రీతిన అవాకులు చవాకులు... బొత్స సత్యనారాయణ
అచ్యుతాపురం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆడలేక మద్దెల దరువు అన్న రీతిన అవాకులు చవాకులు... బొత్స సత్యనారాయణ
పరిశ్రమల్లో రక్షణ చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం..
అదేపనిగా గత మా ప్రభుత్వంపై విమర్శల పర్వం.... బొత్స సత్యనారాయణ ఆక్షేపణ..
విశాఖపట్నం:వైయస్సార్సీపీ ఆర్థిక సాయం..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని, ఎసైన్షియా ఫార్మాలో బ్లాస్ట్ బాధితులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలవనుందని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాకు రూ.5 లక్షల చొప్పున, గాయపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి లక్ష చొప్పున పార్టీ నుంచి సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు స్వయంగా ఆ సహాయాన్ని బాధితులకు అందజేస్తారని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ నిర్దేశించారని ఆయన తెలిపారు.
బ్లాస్ట్ ఘటన తర్వాత సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న మండలి విపక్షనేత, మంత్రులెవరూ సక్రమంగా స్పందించలేదని వెల్లడించారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆయన, ఎంతసేపూ గత తమ ప్రభుత్వంపై నిందలు మోపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఆక్షేపించారు.
బాధ్యత మర్చిన ప్రభుత్వ పెద్దలు:
ఎక్కడైనా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, అక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు, వెంటనే ఏమేం చేశారు?. బాధితులను ఎలా ఆదుకున్నారు?. భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటారో చెబుతారని బొత్స గుర్తు చేశారు. కానీ, ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు, అసలు విషయాన్ని పక్కనపెట్టి ఏదేదో మాట్లాడుతున్నారన్న ఆయన, ప్రభుత్వంలో ఉన్న వారు బాధ్యతతో మాట్లాడాలని స్పష్టం చేశారు.
బుధవారం మధ్యాహ్నం 2.30 కు ప్రమాదం జరిగితే, మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను మర్నాడు విశాఖకు తీసుకొచ్చారని గుర్తు చేసిన ఆయన, ఘటన తర్వాత, కనీసం కార్మికుల కుటుంబాలకు సమాచారం కూడా ఇవ్వలేదని, చాలా మంది తాము టీవీలో చూసి వచ్చామని బాధితుల కుటుంబాల వారు చెప్పారని తెలిపారు.
ఆనాడు మా స్పందన ఇదీ..:
తమ ప్రభుత్వ హయాంలో ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగితే, తామెంత వేగంగా స్పందించామన్నది అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.
‘మా హయాంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తెల్లవారుజామున జరిగితే, ఉదయానికల్లా పలువురు మంత్రులు అంతా, నాతో సహా తరలి వచ్చాం. మధ్యాహ్నానికల్లా స్వయంగా సీఎంగారు కూడా వచ్చారు. ఇది వాస్తవం కాదా? పైగా అప్పుడు కరోనా విజృంభిస్తోంది. అయినా కూడా మేమెవ్వరం వెనక్కు తగ్గలేదు. ఎందుకంటే అది మా బాధ్యతగా భావించాం’ అని మండలి విపక్షనేత స్పష్టం చేశారు.
సెక్యూరిటీ ప్రొటోకాల్:
అదే, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ, తమపై నిందలు వేస్తున్నారని, ఇప్పుడు ఈ ప్రమాదాలకు కారణం తామే అని ఆరోపిస్తున్నారని ఆక్షేపించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న బొత్స, ఇప్పుడు సీఎస్గా ఉన్న అధికారి నేతృత్వంలో ఆరోజు కమిటీ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో భద్రత గురించి నివేదిక తీసుకున్నామని, ఆ మేరకు పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ రూపొందించి, జీఓ కూడా ఇచ్చామని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా తాము బాధ్యతాయుతంగా వ్యవహరించామన్న ఆయన, ప్రమాదం విషయం తెలియగానే, పార్టీ నేతలంతా తరలి వచ్చామని, చివరకు మార్చురీ వద్దకు కూడా పోయామని, అక్కడ మృతుల కుటుంబాల వారిని కలుసుకున్నామని చెప్పారు.
కానీ, ప్రభుత్వం మాత్రం ఒక్క పని కూడా చేయలేదన్న మండలి విపక్షనేత, కనీసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు.
ఆనాడు చాలా వేగంగా..:
తమ హయాంలో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయితే, తాము ఎంత వేగంగా స్పందించామో అందరికీ తెలుసని, అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కోటి రూపాయల చొప్పున పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. వెంటనే రూ.30 కోట్లు ప్రభుత్వం నుంచి ఇచ్చి, ఆ తర్వాత కంపెనీ నుంచి రీయింబర్స్ చేశామని తెలిపారు.
అదే ఇక్కడ, ఫ్యాక్టరీ యాజమాన్యం కనిపించడం లేదని అంటున్నారని, ఇంత కంటే దౌర్భాగ్యం ఉంటుందా? అని.. వారు ఎక్కడున్నా తీసుకురావాలని, పరిహారం వసూలు చేయాలని మండలి విపక్షనేత తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఆ దిశలో పని చేస్తున్నట్లు కనిపించలేదు కాబట్టే, బాధితులను వెంటనే ఆదుకోకపోతే, ధర్నా చేస్తామని, తాను కూడా వచ్చి కూర్చుంటానని జగన్గారు ప్రకటించారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఇకనైనా ఆపండి:
4 రోజుల క్రితం ఎచ్చెర్లలో తమ పార్టీ కార్యకర్త ప్రసాద్పై అధికార పక్షం వారు దాడి చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న (శుక్రవారం) చనిపోయాడని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇకనైనా ఇలాంటివి ఆపాలని, ఇలాంటి వాటిని సభ్య సమాజం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడితో ప్రమేయం ఉన్న వారందరిపై హత్య కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0